
ప్రజాశక్తి - భవానీపురం : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కబేళా సెంటర్లో గల విజయదుర్గ కారం మిల్ను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దిన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులో తయారుచేస్తున్న కారం నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌస్ మొహద్దీన్ మాట్లాడుతూ విజయ దుర్గ కారం మిల్పై కొన్ని ఫిర్యాదులు రావడం కారణంగా కబేళా సెంటర్లోని విజయదుర్గ కారం మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లేబుల్ లేని కారం ప్యాకెట్లు విక్రయించడానికి సిద్ధంగా ఉంచడాన్ని గమనించామని. పది కేజీల కారం ప్యాకెట్లను సీజ్ చేసి తనిఖీల నిమిత్తం తరలించామని అధికారులు తెలిపారు. విజయ దుర్గ కారం మిల్లుపై కొన్ని సాధారణ ఫిర్యాదులు రావడం వల్ల మిల్లు మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. కారం తయారీకి సంబంధించి యాడెడ్ కలర్స్ కానివ్వండి లేక రంపపు పొట్టు వంటి ఏమైనా హాని కారక పదార్థాలు వాడుతున్నారా అనే విషయంపై తనిఖీలు నిర్వహించామన్నారు.