Oct 17,2023 20:26

మాట్లాడుతున్న టిడిపి కౌన్సిలర్లు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఈనెల 19న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పట్టణానికి రానున్న సందర్భంగా బైపాస్‌ రోడ్డులో ఉన్న రేకుల షెడ్డును యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపాలిటీ అధికారులు తొలగించారని టిడిపి కౌన్సిలర్లు దయాసాగర్‌, రాందాస్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. బహిరంగ సభ జరుగుతున్న ప్రదేశం పక్కనే అక్రమంగా మున్సిపాలిటీ స్థలంలో వేసిన బంకులు అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై కొంతకాలంగా తాము అధికారులను కౌన్సిల్‌లో ప్రశ్నిస్తుంటే బంకులను తొలగిస్తామని చెబుతున్నారే తప్ప తొలగించలేదన్నారు. ఇప్పుడు ఎక్కడో ఉన్న బైపాస్‌ రోడ్డులో బంకులను తొలగించారని, పక్కనే ఉన్న మున్సిపల్‌ బంకులను వదిలేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ బంకులకు సొసైటీ వారు ప్రాపర్టీ టాక్స్‌ కూడా అడుగుతున్నారని తెలిసినా అధికారులు ఎందుకు బంకులు తొలగించడం లేదన్నారు. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో పట్టణంలో క్రీడాకారులకు, ఉదయం వాకింగ్‌కు వెళ్లే వారికి ఉపయోగపడే ఏకైక మైదానం కూడా కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. మున్సిపల్‌ బంకులను తొలగించాలని డిమాండ్‌ చేశారు.