వీవోఏలకు మూడేళ్ల కాలపరిమితి రద్దు చేయాలి
కలెక్టరేట్ ఎదుట ధర్నా
వంటావార్పుతో నిరసన
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్:
ఏపి వెలుగు వీవోఏ (యానిమేటర్స్) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరతూ సిఐటియు ఆధ్వర్యంలో 36 గంటల పాటు ధర్నా, వంటావార్పు కార్యక్రమంను మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వీవోఏల జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీవోఏల సమస్యలు పరిష్కారం చేయకుండా గత నాలుగు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తుందని ఇప్పటికైనా వీవోఏల సమస్యలను పరిష్కరించాలని, రాబోయేది ఎన్నికల కాలమని గుర్తుపెట్టుకోవాలని లేకుంటే వైసిపి ప్రభుత్వానికి వీవోఏలు అందరూ ఐకమత్యం చేసి బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతారని హెచ్చరించారు. మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, సిబిఓ హెచ్ఆర్ పాలసి అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విఓల మెర్జ్ ఆపాలి, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, లోకో యాప్ వర్క్ కోసం 5జి మొబైల్ ప్రభుత్వమే ఇవ్వాలని, వాలంటీర్ ఐడితో విఓఎతో పనిచేయించరాదని, విఓఎ ఐడి ద్వారా పనిచేయించాలన్నారు. అలాగే 15 సంఘాల లోపు ఉన్న వీవోఏలకు వేతనాలు చెల్లించాలని, విఓల మెర్జ్ వలన ఉపాధి కోల్పోయిన వీవోఏలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంకు యూనియన్ జిల్లా అధ్యక్షులు జీను రాజశేఖర్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి పి.నాగరాజు, నాయకులు శ్రీధర్, మంగమ్మ, శేషాద్రి, శాంతి, చంద్రబాబు, మణి, విఓఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










