
విధులతో పాటు ఆటల్లోనూ రాణించాలి
- జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి
- ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
మహిళలు విధులతో పాటు ఆటల్లోనూ రాణించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రెవిన్యూ మహిళా విభాగం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆటల పోటీలు మహిళలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేందుకు దొహదపడతాయని అన్నారు. పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయని చెపాపరు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'లింగ సమానత్వంపై దృష్టి, ప్రతి సమాజం డిఎన్ఎలో భాగం కావాలి. ఈక్విటీ.. ఈక్వాలిటీ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం' అనే నినాదాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జెసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకురాలు నాగమణి మాట్లాడుతూ మహిళల్లో మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెన్నికాయిట్, త్రో బాల్ డిస్క్, చాట్ పుట్, షటిల్, తగ్గాఫర్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ తదితర ఆటలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి మాట్లాడుతూ నేడు బుధవారం ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ ఆటల పోటీల్లో ఐసిడిఎస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










