విధుల నుంచి తొలగించారు..న్యాయం చేయండి..
ఎమ్మెల్యేకు పారిశుధ్య కార్మికుల వినతి
ప్రజాశక్తి-నాయుడుపేట: నాయుడుపేట మున్సిపాల్టీలో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను తొమ్మిది నెలల క్రితం తమకు విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని జీవనం కష్టంగా మారిందని తమకు న్యాయం చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పారిశుధ్య కార్మికులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను స్థానిక ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో బుధవారం కలిసి అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాధిత కార్మికులు మాట్లాడుతూ ఈ ఏడాది కొంత మందికి అర్ధాంతరంగా తొలగించారని ఈ కారణంగా తొమ్మిది నెలలుగా జీవనం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మరో జీవనాధారం లేదని వెంటనే తమను విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. కమిషనర్ని ఎప్పుడు కలిసినా ' రేపు మాపో...' అంటూ తమను తిప్పుకుంటున్నారని వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పందిస్తూ తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.










