Oct 16,2023 21:51

ప్రజాశక్తి - నూజివీడు రూరల్‌
           విద్యుద్ఘాతంతో పామాయిల్‌ గెలలు నరికే కార్మికుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పల్లేర్లమూడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్లేర్లమూడి గ్రామానికి చెందిన జంపన రంగారావు(38) ఆయిల్‌పామ్‌ తోటల్లో గెలలు కోసేందుకు వెళ్తుంటాడు. ఎప్పటిలాగే గ్రామంలో ఆయిల్‌పామ్‌ గెలలు కోసేందుకు ఉదయం వెళ్లాడు. ఇనుప కత్తితో గెలలు కోస్తుండగా అది తోటమీదుగా వెళ్లిన విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిపిఎం ఆందోళనతో బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు అందజేత
విద్యుత్‌ షాక్‌తో మరణించిన రంగారావుకు ఆయిల్‌పామ్‌ తోట యజమాని వద్ద నుండి బాధిత కుటుంబానికి సిపిఎం ఆధ్వర్యంలో రూ.ఐదు లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జివిఎస్‌.రాజు ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూశారు.