విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు పై హర్షం
- రాయలసీమ సాగునీటి సాధన సమితి
ప్రజాశక్తి - నంద్యాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని కర్నూలు లో ఏర్పాటు చేయడానికి వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నదని సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాదులో ఉన్న ఈ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.శ్రీ బాగ్ ఒడంబడికను గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనలో భాగంగా చేపట్టిన ఈ చర్యను అభినందిస్తున్నామని అన్నారు. ఈ చర్యతో పాటు న్యాయ సంబంధితమైన రెండు తెలుగు రాష్ట్రల మద్య కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కీలకమైన కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయంను కర్నూలులో ఏర్పాటుకు తక్షణమే నిర్ణయం చేపట్టాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సానుకూల సంబంధాల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్యయంగా రాజకీయ దౌత్యం చేసి కర్నూలులో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఏర్పాటు అయ్యేటట్లుగా చూడాలని దశరథరామిరెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, సౌదాగర్ ఖాసీం మియా, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, నిట్టూరు సుధాకర్ రావు, రాఘవేంద్ర గౌడ్ పాల్గొన్నారు.










