Oct 15,2023 22:35

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
సర్దుబాటు ఛార్జీలు, సర్వీస్‌ ఛార్జీలు.. పేరు ఏదైతేనేమి వినియోదారుడుకి పగలే.. చుక్కలు చూపుతున్నాయి కరెంట్‌ బిల్లులు... నిత్యావసర ధరల, పెరిగిన కరెంట్‌ చార్జీలతో నెలసరి బడ్జెట్‌ పెరిగిపోయి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెత్తిబొబ్పికడుతోంది. నిత్యావసరాలు ఆకాశానంటున్నాయి. పప్పుల ధరలు ఈనెలలోనే 37 శాతం పెరిగాయి. ఇక గతంలో కిలో టమోటా రూ.200లు అమ్ముడు పోయినా దిగుబడి పెరగడంతో కిలో రూ.15 నుంచి 20లకు స్థిరంగా ఉంది. ఒక్కసారిగా టమోటా ధరల పతనం కావడంతో టమోటా రైతులు రోడ్లుపై పారేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కందిపప్పు రూ.80లనుంచి 160లకు పెరిగింది. మినపప్పు, వేరుశనగా, వంటనూనె ధరలు ఒక్క నెలలోనే 22 శాతం పెరిగాయి. సన్న బియ్యం కిలో రూ.55 నుండీ రూ. 60లకు పెరిగింది. వీటికి తోడు పెరిగిన కరెంట్‌ బిల్లులు సామాన్య, మధ్యతరగతికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
విద్యుత్‌ ఛార్జీల మోత
ఎఫ్‌పిపిసిఏ పేరుతో నెలవారీ విద్యుత్‌ వినియోగదార్లపై అదనపు ఛార్జీలు పడుతున్నాయి. ట్రాఅఫ్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, ఎలక్ట్రిసిటి డ్యూటీ పేర్లతో విద్యుత్‌ వినియోదారుల వీపులు విమానం మోత మ్రోగిపోతోంది. ఒక సంవత్సరంలో వినియోదారుల నుంచి నాలుగువేల కోట్లు ప్రజల నుండీ వివిధ రూపాల్లో చార్జీల రూపంలో ప్రభుత్వం లాగేసే ప్రయత్నం చేయడంతో నెలవారీ విద్యుత్‌ బిల్లులు వేలల్లో వస్తున్నాయి. భవిష్యత్‌లో రైతులు వాడుతున్న మోటర్లకు మీటర్లు బిగిస్తే రైతుల పరిస్థితి ఆగమ్మగోచరం కానుంది.
వినియోగం వందలో.. బిల్లు వేళల్లో..
విద్యుత్‌ వినియోగం వందల్లో ఉంటే ప్రభుత్వం ట్రూఆప్‌, సర్‌చార్జీ, ఫిక్స్‌డే, ఎలక్ట్రిసిటిడ్యూటి ఇలా వివిధ రకాల పేరుతో మనం వాడుకుంటున్న కరెంట్‌ చార్జీలో కలపడంతో బిల్లు మాత్రం వేలల్లో వస్తోంది. చిత్తూరు నగరంలో కొండమిట్టలో నివాసం ఉంటున్న శివకుమార్‌ అనే ఓ సామాన్యుడికి ఈనెల విద్యుత్‌ బిల్లు రూ.1,120 వచ్చింది. బిల్లు చూసి షాక్‌కు గురైన శివకుమార్‌ వెంటనే తన ఇంటికి వచ్చిన బిల్లు అందించిన మీటర్‌ రీడింగ్‌ బారుకు పోన్‌చేశాడు. ఇదేదంయ్యా.. నేను వాడిన కరెంట్‌ యూనిట్లకు రూ.200 బిల్లు మాత్రమే రావాల్సి ఉంటుంది. రూ.1,120 బిల్లు ఇచ్చావ్‌' అని అడిగితే అదంతే ప్రభుత్వాన్ని అడుగు నీకు ఇచ్చిన బిల్లులో నువ్వుు వాడిన కరెంట్‌కు వచ్చిన బిల్లు రెండు వందలే అయితే మీ ఇంటి వరకు కరెంట్‌ లాగిన విద్యుత్‌ వైర్‌, కరెంట్‌పోల్‌ సర్వీస్‌ ఛార్జీ, ట్రూఆప్‌ చార్జీ, ఫిక్సడ్‌ చార్జీ ఇలా రకరకాల పేర్లుతో వేసిన చార్జీల వల్ల నీకు ఇచ్చిన కరెంట్‌ బిల్లు కాస్తా రూ.1,120 వచ్చింది. ఏం చేయలేమంటూ వెళ్లిపోయాడు ఇదీ పరిస్థితి. వేలల్లో విద్యుత్‌ బిల్లులు రావడంతో బిత్తర చూపులతో విద్యుత్‌ వినియోదారులు అల్లాడిపోతున్నారు.