Aug 29,2022 00:49

విద్యుత్‌ అమరవీరులకు నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేటర్‌: విద్యుత్‌ అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, సిపిఎం న్యూ సిటీ, ఓల్డ్‌ సిటీ కార్యదర్శులు టి.రాముడు, ఎం.రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం కర్నూలు నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌లో విద్యుత్‌ అమరవీరుల వర్థంతి సభ నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి టి.రాముడు అధ్యక్షత వహించారు. ఈ సభకు హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, సిపిఎం ఓల్డ్‌ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్‌లు విద్యుత్‌ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్‌, బాలస్వామి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2000వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సంస్కరణల పేరుతో విద్యుత్‌ బోర్డును ముక్కలు చేసి ప్రజలపై వేసిన భారాలకు వ్యతిరేకంగా విద్యుత్‌ పోరాటం జరిగిందని తెలిపారు. ప్రపంచంలో అమలవుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. వంద రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ప్రజలందరీ భాగస్వామ్యంతో మహా పోరాటం సాగిందని తెలిపారు. చలో అసెంబ్లీ సందర్భంగా చంద్రబాబు నాయుడు బ్రిటీష్‌ వారిని తలపించేలా బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించారని చెప్పారు. ఆ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్‌, బాల స్వామిలు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికుంటారని తెలిపారు. విద్యుత్‌ పోరాట ఫలితంగా తెలుగు ప్రజలు చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి గోరి కట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను మరిచిపోయిందని తెలిపారు. కేంద్రంలో ఉండే బిజెపి ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ సవరణ చట్టం-2020 ప్రజలపై బలవంతంగా రుద్దుతూ విద్యుత్‌ భారాల పెంపునకు పూనుకుంటున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే జగన్‌మోహన్‌ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ట్రూఅప్‌ చార్జీల పేరుతో ప్రజలపై వేస్తున్న భారాలను, రైతుల బోర్లకు మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు ఎన్‌.అలివేలమ్మ, నగేష్‌, సిపిఎం నగర నాయకులు సి.గురు శేఖర్‌, సుధాకరప్ప, రామకృష్ణ, మహ్మద్‌ రఫీ, హుస్సేన్‌ బాష, ఏసు, వెంకటేశ్వర్లు, రత్నమ్మ, శిరీష, మురళీమోహన్‌, బసయ్య, శ్రీనివాసులు, భాస్కర్‌, రంగస్వామి, రామాంజనేయులు, గోపాల్‌, వెంకట్‌ పాల్గొన్నారు.