Aug 12,2023 17:22

సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు తెలిపారు. శశి ఇంజినీరింగ్‌ కళాశాలలో యాంటీ రాగింగ్‌ దినోత్సవం సందర్భంగా ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారని, తద్వారా తమ జీవితం అగమ్యగోచరంగా మారుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు జ్యుడీషియల్‌ చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒకసారి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణలో ర్యాగింగ్‌కు పాల్పడినట్టు రుజువైతే చదువు కోడానికి, ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. రిటైర్డ్‌ ఎంఇఒ రామరాజు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ప్రవర్తనతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ప్రిన్సిపల్‌ మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ మాట్లాడుతూ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి అన్నమని, పట్టణ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.అప్పిరెడ్డి, సీనియర్‌ అడ్వకేట్‌ డిఎస్‌.రామారావు, లోక్‌ అదాలత్‌, అడ్వకేట్‌ సిహెచ్‌.ఇస్రాయిల్‌రాజు పాల్గొన్నారు.