Sep 13,2023 21:44

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
            విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు నైపుణ్యాలను కూడా మెరుగు పరుచుకుంటే ఉన్నత స్థానాలను అందిపుచ్చుకోగలరని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. స్థానిక డిఎన్‌ఆర్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాను కలెక్టర్‌ పి.ప్రశాంతి సందర్శించి, కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులు వారి చదువుతోపాటు ఎప్పటికప్పడు సాఫ్ట్‌ స్కిల్స్‌ లేదా ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ల్లో నైపుణ్యాని పొందాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఇంత భారీస్థాయిలో జాబ్‌మేళాను ఏర్పాటు చేసిన డిఎన్‌ఆర్‌ కళాశాల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బిఎస్‌.శాంతకుమారి మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో జాబ్‌మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిఎన్‌ఆర్‌ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, పాలకవర్గ సెక్రటరీ, కరస్పాండెంట్‌ గాదిరాజు సత్యనారాయణరాజు, కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు జి.పాండురంగరాజు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి మాట్లాడారు. పాలకవర్గ సంయుక్త కార్యదర్శి కె.రామకృష్ణంరాజు, ట్రెజరర్‌ జివిఎస్‌ఆర్‌.నారాయణ, అసిస్టెంట్‌ సెక్రటరీ కె.శివరామరాజు, పాలకవర్గ సభ్యులు ఎన్‌.రామలింగరాజు, దత్తాత్రేయవర్మ, పి.రామకృష్ణంరాజు పాల్గొన్నారు.