ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు సెయింట్ ఆన్స్ పాఠశాలలో స్పోర్ట్స్ డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన మార్చ్ ఫాస్ట్, విభిన్న సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, జడ్పి ఛైర్మన్ సుభద్ర, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, ఎఎస్పి అతుల్ సిన్హా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక వ్యాయామం కూడా లభిస్తుందన్నారు. చదువులో రాణించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.ఉద్యోగ అవకాశాల్లో క్రీడలకు ప్రాముఖ్యం ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతంలో ఇటువంటి విద్యాసంస్థ ఉండడం సంతోషమని తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానించారు. అంతకుముందు సబ్ కలెక్టర్ వి.అభిషేక్, ఎఎస్పి అతుల్ సిన్హా పాఠశాల జెండా ఆవిష్కరణ చేసి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఇఒ రమేష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.










