విద్యార్థులు అత్యున్నత స్థాయికి చేరుకోవాలి
- ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో జగనన్న ఆణి ముత్యాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్దులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ధి ఇంతటి మంచి మార్కులు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులకు ఎమ్మెల్యే సన్మానించారు. అలాగే విద్యార్థినీ విద్యార్దులకు నగదు బహుమతి ప్రదానం, ప్రశంశా పత్రాలు అందజేశారు. అనంతరం హైస్కూల్ విద్యార్థినీ విద్యార్దులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపిలు గజ్జల రాఘవేంద్ర రెడ్డి, వసీం, అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీవో మహబూబ్ ఖాన్, ఎంఈఓలు శోభా వివేకావతి, అనురాధ, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డోన్ : విద్యార్థులు కష్టపడి చదివితే ఫలితం సాధించవచ్చని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం పద్మావతమ్మ, సీనియర్ ఉపాధ్యాయులు ఎం. వెంకట సుబ్బారెడ్డిలు అన్నారు. పాఠశాలలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం హెచ్ఎం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా ఎఒఇఒ ప్రభాకర్, హెచ్ఎంలు సురేష్, రామ నర్సప్పలు హాజరయ్యారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన సాయికౌశిక్కు రూ. 3 వేలు, దాదా సయ్యద్కు రూ.2 వేలు, జయ నరసింహకు రూ. వెయ్యి నగదు బహుమతి, మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అలాగే హెచ్ఎం పద్మావతమ్మ తన సొంత ఖర్చులతో మొదటి బహుమతి కింద రూ 1000, రెండో బహుమతి రూ.750, మూడవ బహుమతి రూ.500 అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివప్రసాద్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ గౌడ్, ఫోటాన్ సంస్థ అధినేత సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.











