ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ పాఠశాలల్లో విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సుల నిర్వహణకు న్యాయవాదులు, ఎంఇఒలు, ప్యారా లీగల్ వాలంటీర్లు, బాలల పరిరక్షణ అధికారులు తదితరులతో మూడు బృందాలతో ఏర్పాటు చేశారు. బుధవారం కాళిదాసుతో ఏర్పడిన బృందం ఆర్ అగ్రహారంలోని కెఎస్ఆర్పిహైస్కూల్, ఏటి అగ్రహారంలోని ఎస్కెబిఎం హైస్కూల్స్లో సదస్సులో ఏర్పాటు చేశారు. ఈ సదస్సుల్లో ప్యానల్ న్యాయవాది కట్టా కాళిదాసు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోని విద్యార్థులు మంచి లక్షణాలు అలవర్చుకొని, మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. బాల బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శ, స్నేహపూర్వక స్వభావం, దేశభక్తిపై అవగాహన కల్పించారు. బాల బాలికలు అవాంఛనీయ దాడులు, ఇబ్బందులకు గురైతే పాఠశాల ఉపాధ్యాయులకు వెంటనే తెలియపర్చాలని అన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రలోబాలకు గురి కాకుండా ఉండాలని, ఎవరికి వారు ఆత్మరక్షణ చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి టి.దుర్గాభవానీ, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సమీర్, సిఆర్ఎఎఫ్ కోఆర్డినేటర్, ప్యారా లీగల్ వాలంటీరు మంగయ్య, యంఇఒ నాగేంద్రమ్మ, హెచ్ఎం పి.శ్రీనివాసరావు, శేషగిరిరావు, విద్యార్థులు పాల్గొన్నారు.










