ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శుక్రవారం సన్మానించారు. మండలంలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన సద్దలగుడ్డ కాలింగ, కటికారు రాజేశ్వరి ఇంటర్ ఫలితాల్లో అత్యధికంగా మార్కులు సాధించడంతో శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పాఠశాల ఛైర్మన్ బాలప్ప ఆధ్వర్యంలో గ్రామ అభ్యుదయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయణ, కె.రాము సమక్షంలో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభ్యుదయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయణ, కె.రాము మాట్లాడారు. గ్రామంలోనే 1 నుంచి 5వ తరగతి వరకు విజేత ప్రైమరీ స్కూల్లో విద్యనభ్యసించి, స్థానిక జడ్పి హైస్కూల్లో పదో తరగతి ముగించుకొని కటికారు రాజేశ్వరి కర్ణాటకలోనూ, సద్దలగుడ్డ కాలింగ ఆంధ్రాలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధికంగా మార్కులు సాధించారని తెలిపారు. ఇలాంటి విద్యార్థులను తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని చదువులో సమయస్ఫూర్తి పాటిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అలాగే ఈ విద్యార్థులు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే అవసరమైన పుస్తకాలను అందించేందుకు ముందుంటామని తెలిపారు. ఉపాధ్యాయులు శంకరప్ప, శివరాజ్ పాల్గొన్నారు.
విద్యార్థులను సన్మానిస్తున్న పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు










