ప్రజాశక్తి - కొయ్యలగూడెం
విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ అన్నారు. బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో తెలుగు విద్యార్థి సంక్షేమ హాస్టల్ పోరుబాటలో భాగంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రక్షిత తాగునీరు లేదని, చేతులు కడుక్కోవడానికి వాడే నీటినే తాగడానికి ఉపయోగించాల్సి వస్తుందన్నారు. ఫ్యాన్లు తిరగడం లేదని, టాయిలెట్ల వద్ద శానిటైజేషన్ సరిగా లేదని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇవాల్సిన కాస్మోటిక్స్ రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వసతులూ కల్పించే వారన్నారు. గదుల్లో శ్లాబు పెచ్చులూడిపోతున్నాయని, కిటికీలు సరిగా లేవని తెలిపారు. బియ్యం కూడా మొద్దు బియ్యం, అన్నం చిమిడి పోతుందన్నారు. గతంలో ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చేవారని ప్రస్తుతం ఒక్క కిట్టు కూడా లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. చదువుకోవడానికి, తినడానికి ఆరుబయట షెడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. వసతి గృహం బయట డ్రెయినేజీ సక్రమంగా లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుందని, పిల్లలు డ్రెయినేజీ దాటుకుని వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఈ సమస్యలను టిఎన్ఎస్ఎఫ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పారేపల్లి నరేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మణి మట్టే, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పారేపల్లి పవన్కుమార్, కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తంకట రాకేష్, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు గాలి చైతన్య, ప్రధాన కార్యదర్శి నాయుడు పవన్, ఉపాధ్యక్షులు ఎ.జగత్ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టిఎన్్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో తెలుగు విద్యార్థి సంక్షేమ హాస్టల్ పోరు బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణ అధ్యక్షులు గాలి చైతన్య, ప్రధాన కార్యదర్శి నాయుడు పవన్, ఉపాధ్యక్షులు జగత్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గద్దె జశ్వంత్, నాయకులు పాల్గొన్నారు.










