ప్రజాశక్తి-అనకాపల్లి
విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వర రెడ్డి ఆదేశించారు. స్థానిక జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మౌలిక వస్తువుల సమాచారాన్ని నింపే యుడైస్లో వచ్చిన వ్యత్యాసాలు, తాగునీరు విద్యుత్ సదుపాయం, టాయిలెట్లు ఉన్న పాఠశాలల సమాచారం, భవనాలు లేని పాఠశాలల విద్యార్థుల ఎన్రోల్మెంటు, విద్యార్థుల ఫేసియల్ అటెండెన్స్, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పిల్లల అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించే బైజుస్ యాప్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. నాడు -నేడుకు సంబంధించి తల్లిదండ్రుల ఖాతాలో పడిన రివాల్వింగ్ ఫండ్ ఖర్చులు, ప్రాజెక్టు వారీగా పనుల పురోగతి సాధించాలని సూచించారు. విద్యారంగంలో జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, సీఆర్పీలు, ఎంఐఎస్ తదితర సిబ్బంది కృషి చేయాలని సూచించారు.










