Mar 14,2023 23:21

గాయాన్ని చూపుతున్న బాధితుడు సాయిశ్రీనివాస్‌

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : విద్యార్థిని అటకాయించి దారి దోపిడీకి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. క్రోసూరు మం డలం పెరికపాడుకు చెందిన కుంభ సాయిశ్రీనివాస్‌ నరసరా వుపేటలోని ఎంఎఎం కాలేజీలో ఫార్మాడీ చదువుతున్నారు. కోర్సులో భాగంగా కాలేజీ అనంతరం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. సొంతూరుకు రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడంతో ద్విచక్ర వాహనంపైనే రాకపోకలు సాగిస్తూ ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు నరసరావుపేటలో బయలుదేరి ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటికెళ్తుండగా 9 గంటలప్పుడు సత్తెనపల్లి మండలం భృగుబండ వద్దకు రాగానే మరో ద్విచక్ర వాహనంపై మాస్కులు వేసుకుని ముగ్గురు దుండగులు వచ్చి సాయిశ్రీనివాస్‌ను అటకాయించి దౌర్జ న్యానికి పాల్పడ్డారు. మెడలోని బంగారు గొలుసును లాక్కుంటుండగా సాయిశ్రీనివాస్‌ ప్రతిఘటించారు. ఒకరు గొలుసును లాక్కుని వాహ నంపై వెళ్తుండడంతో అతన్ని పట్టుకునేందుకు సాయిశ్రీనివాస్‌ ప్రయత్నించగా అదే అదునుగా మిగతా ఇద్దరూ సాయిశ్రీనివాస్‌ బైక్‌ను తీసుకుని పరారయ్యారు. పెనుగులాటలో గాయపడిన సాయిశ్రీనివాస్‌ అనంతరం సత్తెనపల్లి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎ.బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.