Mar 18,2023 23:05

 ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కే. హేమచంద్రారెడ్డి
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కే. హేమచంద్రారెడ్డి అన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్విజ్‌ పోటీల ఫైనల్స్‌ను నగరంలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. రాయల సీమ, విశాఖపట్నం, అమరావతి రీజియన్స్‌ స్థాయిలో గెలుపొందిన విద్యార్ధులకు రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య కే. హేమచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే అనేక నూతన సంస్కరణలను చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో సుమారు 15 లక్షల మంది విద్యార్ధులు విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు. వారం దరిని పరిశ్రమలకు అనుసం ధానించే విధంగా కోర్సులను రూపకల్పన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ. నారాయణరావు, కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు, మౌరిటెక్‌ బిజనెస్‌ హెడ్‌ వీ. భానుసాయిప్రతాప్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు ఎన్‌. హేమంత్‌ కుమార్‌, వీ. శైలజ తదితరులు పాల్గొన్నారు.