
విద్యారంగ సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి
- ఉద్రిక్తతగా మారిన ఆందోళన
- నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట
- జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
- మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి.
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతలు డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
విద్యారంగం, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తత మారింది. పోలీసులకు, విద్యార్ధి, యువజన సంఘాల నాయకులకు మధ్య తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకుంది. విద్యార్థులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. చివరకు త్రీ టౌన్ సిఐ నరసింహులు డిఆర్ఒ పుల్లయ్యను ఆందోళన వద్దకు పిలుచుకువచ్చారు. దీంతో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు శాంతించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఒకు అందజేశారు. అంతకు ముందు జరిగిన ధర్నాలో ఎఫ్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డక్క కుమార్, నిరంజన్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు శేఖర్, లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి శివ మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైపల్యం చెందిందన్నారు. జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెల 21 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు జిల్లాలోని 29 మండలాలు తిరిగి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లేకపోవడంతో ప్రైవేట్ మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యం వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారని, ఫీజులు కట్టుకోలేక మహిళలు చదువులు మానేస్తున్నారన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రయివేట్ యాజమాన్యం హాస్టళ్లు నడుపుతున్నారని తెలిపారు. వెంటనే జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాధుడే లేరని, నేటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ చార్జీలు పెంచాలని, రెగ్యులర్ వార్డెన్ ఏర్పాటు చేసి వంట మనిషి, వాచ్మెన్, ట్యూటర్లను ప్రభుత్వం నియమించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డీఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఈవెంట్స్ మెయిన్స్ పరీక్షకు మధ్య మూడు నెలలు గడువు ఇవ్వాలన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్దమౌతామని, అవసరమైతే సిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మధు కిరణ్, అశోక్, ప్రతాప్, మహేష్, మధు, జనార్ధన్, విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.