
ప్రజాశక్తి - రేపల్లె
విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంసీఏ నిరంతరం కృషి చేస్తుందని ఎంసీఏ ఎడ్యుకేషనల్ సెక్రటరీ సాయిప్రసాద్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఎంసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా గురువారం పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో వివిధ పాఠశాలల విద్యార్ధులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఎంసీఏ ఎడ్యుకేషనల్ సెక్రటరీ సాయిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్ధులకు డ్రాయింగ్ పోటీలు మూడు విభాగాలలో నిర్వహించామని అన్నారు. 1నుంచి 5వ తరగతి విద్యార్ధులను సబ్ జూనియర్సగా పరగణించి వారికి నచ్చిన అంశంలో, 6, 7, 8 తరగతులు జూనియర్స్గా పరగణించి పల్లెవాతావరణం అంశంపై, 9, 10 తరగతులను సీనియర్స్గా పరిగణించి వీరికి ప్రపంచశాంతి అంశాలపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించామని అన్నారు. 14న మధ్యాహ్నం సోలో, గ్రూపు విభాగాలలో శాస్త్రీయ, జానపద, అభ్యుదయ, దేశభక్తి నృత్య పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలలో విజేతలకు వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంసీఏ సభ్యులు సజ్జా లోకేశ్వరరావు, కెవి సుబ్బారావు, కె రాజగోపాలప్రసాద్, వి లక్ష్మీనారాయణ, బ్రహ్మం, వేజళ్ల చక్రపాణి పాల్గొన్నారు.