Sep 20,2023 21:30

ప్రజాశక్తి - కలిదిండి
   విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సాయం అభినందనీయమని కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని కోరుకొల్లు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన సాంస్కృతిక కళా వేదికను ఆయన ప్రారంభించారు. దాత వర్రే వెంకట సత్యన్నారాయణ, సత్య నీరజ దంపతులు(యుఎస్‌ఎ) రూ.9 లక్షల ఆర్థిక సాయంతో కళా వేదికను నిర్మించినట్లు వర్రె వెంకట సత్యన్నారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి చన్నంశెట్టి కృష్ణ తెలిపారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీ గోడను రూ.2 లక్షలతో నిర్మించగా ఎంఎల్‌ఎ ప్రారంభించారు. కళాశాల వరండాకు ఐరాన్‌ మెస్‌ను రూ.లక్షా 50 వేలతో చేయించిన దాత ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావును ఎంఎల్‌ఎ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కట్టా నాగలక్ష్మి, సర్పంచి ఎం.మారుతీ ప్రసన్న, వైసిపి మండల అధ్యక్షులు తిరుమాని రమేష్‌, హెచ్‌ఎం నామన శ్రీనివాసరావు పాల్గొన్నారు.