Dec 29,2022 23:01

యుటిఎఫ్‌ డైరీ ఆవిష్కరణలో ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌

విద్యా ప్రమాణా లను మెరుగుపరిచి ఫలితాలలో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన కార్యాయలంలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో ఉత్తమ ఫలితాలను సాధించి, జిల్లా అగ్రస్థానంలో నిలిచేందుకు నూతన సంవత్సరం నాంది పలకాలన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రణాళిక బద్దంగా ఉపాధ్యాయులు ముందుకు వెళితే లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు. ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతుందని ఎన్నడు లేని విధంగా పాఠశాలలో కళాశాలలో పూర్తి మౌలిక వసతులను ఆధునాతన బోధన విధానాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యా బోధన అందించేలా సంఘ సభ్యులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు. డైరీ ఆవిష్కారణలో యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్‌పి మనోహరకుమార్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ. సుందరయ్య, గౌరవ అధ్యక్షులు యం శ్రీనివాస్‌, కార్యదర్శి యం శ్రీనివాస్‌, అడిట్‌ కమిటీ మెంబర్‌ ఏ గోపాలకృష్ణ, నగర అధ్యక్షులు అనంత్‌కుమార్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు.