Jun 11,2023 23:47

ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌పై వివక్ష చూపిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలు నశించాలని, అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు. సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్‌, సిపిఐ నాయకులు అరుణ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరు కుమార్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు గనిరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాలు అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ఫోక్సో కంపెనీకి కారు చౌకగా అమ్మేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కును అమ్మాలని చూస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చూస్తూ ఊరుకోరని వామపక్ష నాయకులు హెచ్చరించారు. పెట్రోలు, డీజీలు, గ్యాస్‌, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఢిల్లీ తలదన్నే విధంగా అమరావతి రాజధాని నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపన సందర్భంగా నరేంద్ర మోడీ గుప్పెడు మట్టి, చెంబు నీళ్లు తెచ్చి, రాజధాని పేరుతో ప్రజల మధ్య గొడవలు పెడుతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు ఇంత దారుణంగా అన్యాయం చేసిన నరేంద్ర మోడీకిగానీ, అమిత్‌ షాకుగానీ రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు బిజెపి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తున్న రాష్ట్ర అధికార, ప్రతిపక్ష వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు నోరు మెదకపోగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బాగా చేస్తుందని ప్రచారం చేయడం అంటే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌.భావన్నారాయణ, ఈమని అప్పారావు, నాయకులు బి.శ్రీనివాసరావు, ఎల్‌.అరుణ, కె.శ్రీనివాసరావు, షేక్‌.ఖాశింషహీద్‌, ఎస్‌.కార్తిక్‌, షేక్‌ ఖాశింవలి, సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : విశాఖపట్నంలో కేంద్ర హోం మంత్రి పర్యటించడానికి నిరసిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్‌ సెంటర్లో నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని, దాన్ని అమ్మే కుట్రలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, జె.శివభావన్నారాయణ, కె.శ్రీనివాసరావు, ఎస్‌.గణేష్‌, టి హేమసుందర్‌రావు, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, వై.వెంకటేశ్వరరావు, కె.కాసియా, ఎ.ప్రభాకర్‌, చిన్ని సత్యనారాయణ, ఎస్‌కె.జానీ, హనుమయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : సిపిఎం, సిపిఐ రాజధాని కమిటీ, తాడేపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉండవల్లి సెంటర్‌లో నిరసన తెలిపారు. కార్యక్రమానికి సిపిఎం పట్టణ నాయకులు వి.దుర్గారావు అధ్యక్షత వహించగా రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన హామీలతో పాటు అన్ని విధాలా అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వం కేంద్ర హోం మంత్రి అమిత్‌సా ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాలో పర్యటిస్తారని ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధికి వెనుకబడిన ప్రాంతాలకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను దగా చేశారని విమర్శించారు. నూతన విద్యుత్‌ సంస్కరణలు, గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన బిజెపిని ఇంటికి సాగనంపాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నాయకులు వి.వెంకటేశ్వరరావు, ఇ.రామారావు, సిహెచ్‌ సుందరరావు, ఎస్‌కె పీరూసాహెబ్‌, డి.విజయబాబు, కె.బాబూరావు, ఎ.వీరవెం కయ్య, ఎస్‌కె జానీ, వై.బర్నబస్‌, ఎన్‌.దుర్గా రావు, వి.శాస్త్రి, పి.రాఘవులు, పి.వెంకటేష్‌, పార్ధసారధి, శేషయ్య, కె.రామకృష్ణ, డి.యోహాన్‌, జి.సుంకన్న పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పెదకాకాని : మండల కేంద్రమైన పెదకాకాని సెంటర్లో నిరసన చేపట్టగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి.సత్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి ఎన్‌.శివాజీ మాట్లాడారు. నాయకులు కె.సత్యనారాయణ, కె.రాఘవయ్య, డి.శ్రీనివాసరావు, ఎస్‌కె.బాజి, షేక్‌ కరీముల్లా, పి.డేవిడ్‌ రాజు, ఆర్‌.శ్రీనివాసరావు, ఆర్‌.కుమారి, జి.రమణ కుమార్‌ పాల్గొన్నారు.