ప్రజాశక్తి-లీగల్ విలేకరి : విభిన్న ప్రతిభావంతుల్లో ప్రతిభను గుర్తించి వివిధ రంగాల్లో అభివృద్ధి చెందేలా స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటునందివ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానులు హరిహరనాథ శర్మ కోరారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యాన విభిన్న ప్రతిభావంతులకు సింహాచలంలో ప్రత్యేక న్యాయ సేవా శిబిరం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ సమకూర్చిన కృత్రిమ అవయవాలను విభిన్న ప్రతిభావంతులకు ప్రధాన్యాయమూర్తి అందించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులచే సాంస్కృతిక, నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెకెవి.బులికృష్ణ, బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్ కుమార్, న్యాయవాదులు గుడిపల్లి సుబ్బారావు, పైలా శ్రీనివాసరావు, కదిరి రాము, గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్ పాల్గొన్నారు.










