Aug 31,2023 00:22

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న విఆర్‌ఎలు

ప్రజాశక్తి- అనకాపల్లి
వీఆర్‌ఏల సమస్యల పరిష్కరించాలని కోరుతూ బుధవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి కోటేశ్వరరావు మాట్లాడుతూ విఆర్‌ఎల సమస్యలపై ఈనెల 25న చలో విజయవాడ సందర్భంగా వీఆర్‌ఏలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీఆర్‌ఏల సంఘంతో చర్చలు చేసి సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, విఆర్‌ఎల్‌ ప్రమోషన్లు కల్పించాలని, నామిని వీఆర్‌ఏలను రెగ్యులర్‌ చేయాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని పోలీసులు ద్వారా అణిచివేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కే రవికుమార్‌, శ్రీను, దేముడు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏవో శ్రీనివాసరావుకు అందజేశారు.