ప్రజాశక్తి -వెంకటాచలం :రోజురోజుకి భగవాన్ వెంకయ్య స్వామి ప్రాశస్త్యం దశదిశలా వ్యాప్తి చెందు తుందని, ఇలాంటి గొప్ప ఆలయం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 41వ ఆరాధనోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం రథోత్సవాన్ని పురస్కరించుకుని సతీ సమేతంగా మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తుల కర్పూర నీరాజనాలు, ఓం నారాయణ.. ఆదినారాయణ నామ స్మరణలతో గొలగమూడి మారుమ్రోగగా, రథోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. రథంపై ఆశీనులైన వెంకయ్య స్వామి వారిని పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్లు ఎంఎల్ఎ హోదాలో, రెండేళ్లు మంత్రి హోదాలో వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం తన లభించించడం సంతోషంగా ఉందన్నారు. తొలుత ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి బాలసుబ్రమణ్యం, ఆర్డిఓ మలోల, తాసిల్దార్ కష్ణ, ఆలయ పాలకమండలి సభ్యులు, వైసిపి నాయకులు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మండల వెంకట శేషయ్య, కనుపూరు కోదండ రామారెడ్డి ఉన్నారు.










