వెంకటగిరిలో ఇన్వెస్ట్ ఇండియా టీం ప్రతినిధి విస్తృత పర్యటన
ఓడీఓపీ అవార్డు
2023 పోటీలో వెంకటగిరి చేనేతలు
ప్రజాశక్తి-వెంకటగిరి: ఒన్ ఇండియా ఒన్ ప్రోడక్ట్ (ఓడీఓపీ) అవార్డు 2023 ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీలో వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి తోడ్పడుతుందని అందుకే నేడు పరిశీలిస్తున్నామని ఇన్వెస్ట్ ఇండియా టీం కమిటీ ప్రతినిధి బందం ప్రతినిధి జగీష్ తివారి మిశ్రా తెలిపారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వెంకటగిరి చేనేత వస్త్రాలు పోటీపడుతున్న నేపథ్యంలో వెంకటగిరిలో ఇన్వెస్ట్ ఇండియా టీం కమిటీ ప్రతినిధితో కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, అధికారులు విస్తృతంగా పర్యటించి వెంకటగిరి చేనేతపై నేత నుండి విక్రయం, చరిత్ర, సంస్కతి వంటివి నేతన్నలతో , నిష్ణాతులతో మమేకమై స్వయంగా పరిశీలించారు. ఇన్వెస్ట్ ఇండియా టీం కమిటీ ప్రతినిధి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని 751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల తరపున ఆయా జిల్లాల, రాష్ట్రాల అధికారుల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు నేడు తిరుపతి జిల్లాకు చెందిన వెంకటగిరి చేనేత వస్త్ర నైపుణ్య ఉత్పాదనలు పరిశీలించామని, కేంద్రానికి నివేదిక అందించానున్నామని వివరించారు. ప్రతి విషయంలో అడుగు అడుగునా అభిమానించిన నేతన్నలకు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన వెంకటగిరి చేనేత వస్త్రాల నైపుణ్యానికి ఓడీఓపీ 2023 అవార్డు లభించి సంబంధిత మార్కెటింగ్ మరింతగా విస్తరించడమే కాక జిల్లా ప్రతిష్ఠ కూడా మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కమిటీ ప్రతినిధికి స్వాగతం పలికారు. అనంతరం వెంకటగిరిలో బంగారు పేటలో నేతన్న నాగరాజు నూలు వడికే ఆశును చూపిస్తూ ఆశు ప్రక్రియ అనంతరం గంజికి పంపే విధానం వివరించారు. నేతన్న కూనా మల్లికార్జున పట్టు , కాటన్ వంటివి వస్త్రాలు దోనికి చుట్టే విధానం వివరించారు. టాటా ట్రస్ట్ అంతరాన్ అందిస్తున్న సహకారం , నేతన్నలను వారి వృత్తిలో నైపుణ్యత కల్పించడం,మగ్గం పై నేత నేయడం, వస్త్రం పై దేవుళ్ళ బొమ్మల అల్లకం వంటివి ఉచిత శిక్షణ ఇస్తున్న వంటివి వివరించారు. స్థానిక నేతన్నలు వృత్తిలో కలిగే సంతోషాన్ని , తమ అనుభవాలను వివరించారు. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం సహకారం తో కేంద్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత వేయి మందికి పైగా శిక్షణ ఇచ్చిన మగ్గాలు, నేసిన రకాల చీరలు, తనకు అందిన అవార్డులు , కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందించిన ఎలక్ట్రానిక్ నేత మిషన్ (పవర్ లూం కాదు )వంటివి వివరించారు. అలాగే మరో అవార్డు గ్రహీత అయిన జి.రమణయ్య జామ్దాని ట్రెడిషన్ రంగంలోచీరలపై నేసిన బొమ్మల వస్త్రాలను , నేసే విధానం, రాజుల కాలంలో వీటి ప్రత్యేకత వివరించారు. రాజ రాజేశ్వరి చేనేత సహకార సంఘం పరిశీలించి సంఘం ద్వారా ముడి సరుకులు ఇవ్వడం, నేతన్నలకు ఉపాధి కల్పించడం, నేసిన వాటికి ప్రముఖ కంపెనీలతో మాట్లాడి మార్కెటింగ్ కల్పించడం వంటివి సంఘం ప్రతినిధి సుమంత్ వివరించారు. అనంతరం ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హాండ్ లూమ్ టెక్నాలజీ కళాశాల పరిశీలించి అక్కడ అందుతున్న శిక్షణ, వుద్యోగ అవకాశాలు ప్రిన్సిపల్ గిరిధర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సంతప్తి వ్యక్తం చేసారు. ఈ పర్యటనలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ , జిల్లా చేనేత జౌళి శాఖ ఆర్ డి రాజారావు, ఎ డి పిచ్చేశ్వర రావు, క్లస్టర్ డెవెలప్ మెంట్ అధికారులు శ్రీదేవి, మునిసిపల్ కమిషనర్ వెంకటరామయ్య, తహశీల్దార్ పద్మావతి , టాటా ట్రస్ట్ మస్తానయ్య, సురేష్, నేతన్నలు , మాస్టర్ వీవర్లు చింతగింజల సుబ్రహ్మణ్యం, స్థానికు లు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.










