Oct 29,2022 23:08

 మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ప్రజాశక్తి - వన్‌టౌన్‌

స్థానిక 47వ డివిజన్‌ లోని 146వ సచివాలయం పరిధిలో 123వ రోజు శనివారం గడపగడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఒక వేదికలా ఉపయోగ పడుతుందన్నారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్‌కు పిచ్చి పెరిగిపోయిందన్నారు. బుద్దా వెంకన్న హీరో అనుకుంటున్నాడు కాని ఆయన ఒక జీరో అని ఎద్దేవా చేశారు. బుద్దా వెంకన్నే నిరవధిక దీక్ష చేయలేక పోలీసులను పిలిపించుకొని దీక్ష భగం చేయించుకున్నాడన్నారు. పశ్చిమలోని తన డివిజన్‌లో సొంత అన్ననే కార్పొరేటర్‌గా గెలిపించుకోలేని వెంకన్న వైజాగ్‌ వెళ్ళి ఏం పీకుతాడు అని ప్రశ్నించారు. వెంకన్న డ్రామాలు ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. విశాఖ, అమరావతి, రాయలసీమ అభివద్ధికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ గోదావరి గంగా, బాబు, డివిజన్‌ నాయకులు కార్యకర్తలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది వాలంటరీస్‌ మరియు నగరపాలక సంస్థ, రెవిన్యు అధికారులు పాల్గొన్నారు.