Mar 24,2023 00:06

పల్టీ కొట్టిన కారు

ప్రజాశక్తి-యంత్రారగం : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందిన ఘటనలు బుధవారం చోటు చేసుకున్నాయి...
తగరపువలస : స్థానిక 16వ నంబర్‌ జాతీయ రహదారి వలందపేట జంక్షన్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్‌ఐ హరీష్‌ కథనం ప్రకారం... శ్రీకాకుళం నుంచి కారులో విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం వెళ్తుండగా ఆగి ఉన్న ఆటో, లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢ కొంది. కారు పల్టీ కొట్టి ఆవల రోడ్డులో పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న సూపర్‌ లగ్జరీ ఆర్టీసీ బస్సును కారు ఢకొీంది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా, గార మండలం, కళింగపట్నంనకు చెందిన వ్యాపారి పట్నాన సంతోష్‌కుమార్‌ (32), శ్రీకాకుళం టౌన్‌ రాజేశ్వరి పీఠం, భావన పుత్ర నిలయంనకు చెందిన లాడే దుర్గా ప్రసాద్‌ (25) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో సంతోష్‌ కుమార్‌ కారును డ్రైవ్‌ చేస్తున్నాడు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంతోష్‌ కుమార్‌ తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రికి మెసేజ్‌ చేసిన గంటల వ్యవధిలోనే ప్రమాదం
''విశాఖ నుంచి శ్రీకాకుళం తిరిగి వచ్చేస్తున్నాం.. ఇంటి తలుపులు తెరిచే ఉంచండి'' అంటూ మృతుల్లో ఒకరైన సంతోష్‌ కుమార్‌ తండ్రి నాగేశ్వరరావుకు మొబైల్‌తో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మెసేజ్‌ పంపించాడు. మెసేజ్‌ పంపిన మూడు గంటల వ్యవధిలోనే రాత్రి 1 గంటకు వలందపేట జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది.
మరో ప్రమాదంలో ఎఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి
భీమునిపట్నం : స్థానిక బీచ్‌ రోడ్డు చొక్కవానిపాలెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మ్‌డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. విశాలాక్షి నగర్‌కు చెందిన ఆర్మ్‌డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌
ఎం.సన్యాసిరావు (53) స్థానిక బ్యాంక్‌ కాలనీలో ఉన్న పోలీస్‌ ఐజి బంగ్లా వద్ద విధులు ముగించుకుని బీచ్‌ రోడ్డు మీదుగా హోండా యాక్టివా పై విశాలాక్షి నగర్‌ వెళ్తున్నారు. ఎదురుగా రోయల్‌ ఎన్ఫీల్డ్‌పై ఇద్దరు యువకులు వేగంగా వస్తూ యాక్టివాను ఢకొీట్టారు. ఈ ప్రమాదంలో ఎఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సన్యాసిరావుకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్తితి విషమించడంతో సన్యాసిరావు మృతి చెందారు. సిఐ కె.లక్ష్మణమూర్తి ఆధ్వర్యాన ఎస్సై తాతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.