భువనేశ్వర్ : 100 శాతం వ్యాక్సిన్ల పంపిణీతో భువనేశ్వర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నగరంలో 18ఏళ్లు పైబడిన, అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ రెండు డోసులను అందించినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నగరం ఇదేనని కమిషనర్ అన్షుమన్ రథ్ తెలిపారు. భువనేశ్వర్లో 18ఏళ్ల వయసు పైబడిన వారు దాదాపు 9లక్షల మంది ఉండగా.. ఇప్పటివరకు 18.16లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించినట్లు అన్షుమన్ చెప్పారు. నగరంలో అర్హులైన 100శాతం మందితో పాటు వలస కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఇక్కడ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో 31వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, 33వేల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు, 5.17లక్షల మంది 18 - 44 ఏళ్ల మధ్య వయస్కులు, 45ఏళ్లు పైబడిన 3.25లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, 55 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం మరింత వేగవంతంగా పూర్తి చేసినట్లు అన్షుమన్ తెలిపారు.