Nov 17,2022 23:09

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న విసి ప్రసాదరెడ్డి

ముఖ్య అతిథులుగా ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ :
ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశాన్ని వచ్చేనెల 17న నిర్వహిస్తున్నట్లు విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి ఎయు శతాబ్ది ఉత్సవాల సమారోహణ, 2025 ఏప్రిల్‌ 26 నుంచి శతాబ్ది వార్షికోత్సవాలు జరుగుతాయన్నారు. గురువారం ఎయు అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో దీనికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, ఎయు పూర్వవిద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, జిఎంఆర్‌ సంస్థల అధినేత జిఎంఆర్‌ అధ్యక్షతన వచ్చేనెల 17న జరిగే వార్షిక సమావేశానికి ముఖ్య అతిధిగా ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, ప్రత్యేక అతిధిగా అవంతి ఫీడ్స్‌ లిమిటెడ్‌ సిఎండి ఎ.ఇంద్రకుమార్‌ హజరవుతారన్నారు.. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి రోజంతా ఎయులోనే పర్యటించి, ఇంక్యుబేషన్‌ సెంటర్‌, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, ఫార్మశీ విభాగం, అమెరికన్‌ కార్నర్‌ వంటివి పరిశీలిస్తారన్నారు. త్వరలో ఇథియోపియాలో ఎయు పూర్వవిద్యార్థుల సంఘం కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆచార్య బీల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎ.మన్మోహన్‌, రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కష్ణమోహన్‌, జనరల్‌ సెక్రటరీ ఆచార్య బి. మోహన వెంకట రామ్‌, సంయుక్త కార్యదర్శి కుమార్‌రాజ, జిఎంఆర్‌ ప్రతినిధులు రామకృష్ణ, భువన పాల్గొన్నారు.