May 24,2023 19:21

వినతిపత్రం సమర్పిస్తున్న సర్పంచి హైమావతి

ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్ల మేజర్‌ పంచాయతీ ఎస్‌ఎస్‌ ట్యాంకు వాటర్‌ వర్క్స్‌కు విద్యుత్‌ కోతలను మినహాయించి, నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేయాలని సర్పంచి హైమావతి కోరారు. బుధవారం గోనెగండ్ల విద్యుత్‌ కార్యాలయం వద్ద అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ సుధాకర్‌ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో ఈ మధ్యకాలంలో ఎల్‌ఆర్‌ పేరుతో విద్యుత్‌ కోతలు అధికమయ్యాయని తెలిపారు. వేసవి దృష్ట్యా విద్యుత్‌ కోత వల్ల గ్రామానికి నీరందించే ఎస్‌ఎస్‌ ట్యాంకు మోటార్లు పనిచేయకపోతే గ్రామంలో ప్రజలకు తాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. విద్యుత్‌ అధికారులు స్పందించి 'లోడ్‌ రిలీఫ్‌' పేరుతో విధించే విద్యుత్‌ కోతల నుంచి ఎస్‌ఎస్‌ ట్యాంకు మోటార్లను మినహాయించి నిరంతరం విద్యుత్‌ అందజేసి గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అడ్వకేట్‌ పూజారి చంద్ర, వెంకటేశ్వర్లు, బాబు నాయుడు, మెకానిక్‌ మలాంగ్‌ పాల్గొన్నారు.