జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న టిడిపి
ప్రజాశక్తి -గాజువాక : 65వ వార్డు వాంబే కాలనీలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ, జివిఎంసి ఎన్నికలకు ముందు కాలనీని దత్తత తీసుకుని అభివృధ్ధి చేస్తానని నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన వైసిపి కార్పొరేటర్ కేబుల్ మూర్తి, రెండేళ్లు గడుస్తున్నా వీసమంతైనా అభివృద్ధి చేపట్టలేదని ఆరోపించారు. డ్రైనేజీలు, రోడ్లతోపాటు చివరకు వీధిదీపాలు లేక వార్డు ప్రజలు అవస్థలు పడుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని మండిపడ్డారు. తక్షణమే కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జెడ్సి సింహాచలానికి వినతిపత్రం అందజేశారు.










