Oct 24,2023 23:31

విజేత జట్టుకు మెమోంటో అందజేస్తున్న ఎంపిపి కారం లక్ష్మి తదితరులు

ప్రజాశక్తి- విఆర్‌.పురం
మండలంలోని కుంజ వారి గూడెం గ్రామంలో కొమరం భీమ్‌ యూత్‌ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు నిర్వహించిన వాలీబాల్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. ములకనపల్లి జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో 40 టీములు పాల్గొనగా, ఫైనల్‌ మ్యాచ్‌ మంగళవారం జరిగింది. మొదటి బహుమతి రూ.20వేలు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య జ్ఞాపకార్థం సిపిఎం మండల కమిటీ సమకూర్చగా, ద్వితీయ బహుమతి రూ.15వేలు ఎఎస్‌డిఎస్‌ సంస్థ డైరెక్టర్‌ ఉండవల్లి గాంధీ బాబు, తృతీయ బహుమతి రూ.10వేలు ఉపాధ్యాయుడు జల్లి బాబురావు, కనిత, చింతూరు విద్యుత్‌ ఎఇ గణేష్‌ సమకూర్చారు. ఈ మేరకు ఎంపీపీ కారం లక్ష్మి, ఎఎస్‌డిఎస్‌ సంస్థ డైరెక్టర్‌ వి.గాంధీబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు చేతుల మీదుగా ప్రథమ బహుమతి ములకనపల్లి జట్టుకు, ద్వితీయ బహుమతి చొప్పల్లి జట్టుకు, తృతీయ బహుమతి వేగుతోట జట్టుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి లక్ష్మి, గాంధీబాబు మాట్లాడుతూ ఆదివాసీ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు దోహదపడతాయని తెలిపారు. క్రీడలు వల్ల మానసిక ఉల్లాసం, స్నేహం పెరగడంతో పాటు, చెడు వ్యసనాలకు దూరంగా మంచి మార్గం వైపు నడుచుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ములకనపల్లి సర్పంచ్‌ సవలం మారయ్య, మాజీ ఎంపీటీసీ కుంచ అర్జమ్మ, మాజీ సర్పంచ్‌ రవ్వ సుజాత, గ్రామ పెద్ద మోసం పెంటయ్య, ప్రజలు పాల్గొన్నారు.