ఆందోళన చేపడుతున్న గ్రామస్తులు
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:నేవల్ బేస్ నిర్మాణంతో తమకు ఇస్తామన్న ప్యాకేజీ సమస్యపై తక్షణం స్పందించాలని వాకపాడు గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం ఉదయం మండలంలోని వాకపాడు గ్రామంలో సర్పంచ్ మైలపల్లి శ్రీను నేతృత్వంలో ఆందోళన చేశారు. నేవల్ బేస్ నిర్మాణంతో వాకపాడు, బంగారమ్మపాలెం తదితర గ్రామాలలోని ప్రజలు ఉపాధి కోల్పోయారని గ్రామస్తులు తెలిపారు. నిర్మాణానికి ముందు తమకు ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం సరికాదని, దీనిపై నేవల్ బేస్ అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాకపాడు, బంగారమ్మపాలెం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.










