
ప్రజాశక్తి - పెనుమంట్ర
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలానికి చెందిన పలువురు కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభా అవార్డులు అందుకున్నారు. స్వల్ప కాలంలోనే రెండు అవార్డులు పొందిన ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి, ఎన్ఆర్ఇజిఎస్ టిఎ ఎం.బాపూజీ, ఇఒపిఆర్డి పివివిఎస్ రాంప్రసాద్, తహశీల్దార్ కార్యాలయం నుంచి సిఎస్ ఆర్ఐ పోతురాజు, కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్, ఆలమూరు వెటర్నరీ వైద్యులు డాక్టర్ జి.రవికాంత్ అవార్డులు అందుకున్నారు. వారికి ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి), తహశీల్దార్ దండు అశోక్ వర్మ, ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), జెడ్పిటిసి కర్రి గౌరీ సుభాషిణి, ఎస్ఐ బి.సురేంద్ర కుమార్ తదితరులు అభినందించారు.
తాడేపల్లిగూడెం : భీమవరంలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ తహశీల్దార్గా తాడేపల్లిగూడెం తహశీల్దార్ వై.దుర్గాకిషోర్, ఉత్తమ అధికారిగా జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె.మల్లికార్జునరావు కలెక్టర్ పి.ప్రశాంతి చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.
ఆకివీడు : జిల్లా ఉత్తమ ఎంఇఒగా ఆకివీడు మండల విద్యాశాఖ అధికారి ఎ.రవీంద్ర అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏటా ఓ ఎంఇఒకు అందించే ఉత్తమ సేవా అవార్డు ఈ సంవత్సరం రవీందర్కు దక్కింది. ఆయన ఐదేళ్లుగా సేవలందిస్తుండగా, ప్రస్తుతం కాళ్ల, ఉండిలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా భీమవరంలో మంగళవారం ఆయన అవార్డు అందుకున్నారు.
ఆచంట : స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపిడిఒ విఎస్విఎల్.జగన్నాథరావు కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమ అవార్డును రెండోసారి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, ఎఎంసి ఛైర్ పర్సన్ చిల్లే లావణ్య, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, జెడ్పిటిసి ఉప్పలపాటి సురేష్బాబు, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు అభినందించారు.
పోడూరు : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖ ఎఇ ఎల్.శ్రీనివాస్ కలెక్టర్ పి.ప్రశాంతి చేతుల మీదుగా సేవా అవార్డు అందుకున్నారు. భీమవరం కలెక్టరేట్ వద్ద పురస్కారం అందుకున్నారు.
ఉండి : గతేడాది పలు విభాగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ డిప్యూటీ తహశీల్దార్ అవార్డును ఎస్.వీరాస్వామి నాయుడు అందుకోగా, గ్రామ రెవెన్యూ అధికారి విభాగంలో వాండ్రం విఆర్ఒ సైదాడ చిన్నారావు, ఉత్తమ సర్వేయర్ విభాగంలో మండల సర్వేయర్ రత్నావళి, విఆర్ఎల విభాగంలో చిలుకూరు విఆర్ఎ కొడవర్తి శ్రీనివాస్, వాండ్రం విఆర్ఎ కోణాల రవి, గ్రామ సర్వేయర్ల విభాగంలో కలిసిపూడి సర్వేయర్ మారుతి, చిలుకూరు గ్రామ సర్వేయర్ ఆశ, వినియోగదారుల సంఘం కార్యదర్శి విభాగంలో యండగండి వినియోగదారుల సంఘం కార్యదర్శి పివిఎస్ గోపాలకృష్ణంరాజు అవార్డులను కలెక్టర్ పి.ప్రశాంతి చేతులమీదుగా అందుకున్నారు. పోలీస్ శాఖకు చెందిన ఉత్తమ సేవా పతాకాన్ని ఉండి ఎఎస్ఐ సుబ్బారావు నిడమర్రు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా అందుకున్నారు.