ప్రజాశక్తి-ఆనందపురం : ఇంజినీరింగ్ విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో ఉత్తమ శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలని జెఎన్టియు ఇండిస్టియల్ ప్లేస్మెంట్ డైరెక్టర్ జయసుమ సూచించారు. మండలంలోని సొంఠ్యాం నడిమిపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో హెచ్ఎమ్ఐ కంపెనీ ఆర్థిక సాయంతో అందజేసిన ఎనిమిది లక్షలు విలువచేసే కంప్యూటర్ లేబొరేటరీని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జయసుమ మాట్లాడుతూ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పారిశ్రామిక విద్యను అందించాలని, ఆధునిక టెక్నాలజీని సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. బైపిసి విద్యార్థులను కూడా పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడానికి అవకాశముందన్నారు. హెచ్ఎంఐ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారి దివిస్ హరివత్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ ల్యాబ్ దోహదపడుతుందన్నారు. కళాశాల సెక్రటరీ ప్రసాద్రాజు మాట్లాడుతూ, ఉత్తమ పారిశ్రామిక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, సుమారు 8 కంపెనీలు తమ కళాశాలలో నియామకాలు జరుపుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, సెమ్స్ సిఇఒ చేతు మాధవన్, కనకరాజు, టి.రాజముర్గన్ డీన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.










