Aug 27,2022 19:51

మాట్లాడుతున్న సిఐ ఎలిషావలీ

ప్రజాశక్తి - కౌతాళం
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సిఐ ఎలిషావలీ, ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి కోరారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వినాయక మండలికి పోలీసు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. కులమతాలకు అతీతంగా వినాయకచవితి వేడుకలను జరుపుకోవాలని కోరారు. మండలంలో శాంతియుతంగానే అనేక పండగలు జరిగాయని గుర్తు చేశారు. వినాయక చవితి పండగను కూడా జరుపుకోవాలని కోరారు. విశ్వహిందూ పరిషత్‌ నాయకులు మారుతి మోహన్‌, ఆవాజ్‌ కమిటీ సభ్యులు ఖాజా హుస్సేన్‌ పాల్గొన్నారు. నందవరం పోలీసు స్టేషన్‌లో గ్రామాల పెద్దలు, కమిటీ సభ్యులతో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐ మహేష్‌ కుమార్‌ మాట్లాడారు. వినాయక మండపాలకు కచ్చితంగా ఈ నెల 29లోపు అనుమతి తీసుకోవాలని తెలిపారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే కమిటీ సభ్యులు పోలీసు, పంచాయతీ, విద్యుత్‌, అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనుమతులకు సంబంధించి దరఖాస్తులు మహిళా పోలీసుల దగ్గర అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రయివేట్‌ స్థలాల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసే కమిటీ పై శాఖల అనుమతి లేనిదే కూర్చోబెట్టరాదన్నారు. మసీదులు, చర్చీల వద్ద ఎలాంటి సౌండ్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ధ్వనులు చేయరాదని, డిజెలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు. విగ్రహాలకు మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. నిమజ్జనం ఎక్కడ చేస్తారో కూడా దరఖాస్తులో వివరించాలని చెప్పారు. చిప్పగిరి మండలంలోని 16 గ్రామాల్లో వినాయక విగ్రహం కూర్చోబెట్టే వారు పోలీసు స్టేషన్‌లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్‌ఐ మల్లికార్జున సూచించారు. మూడు రోజుల్లోపు నిమజ్జనం చేయాలని తెలిపారు. విగ్రహాన్ని ప్రతిష్టించే వారు గ్రామ సచివాలయ అధికారుల సంతకంతో పాటు మీసేవలో చలానా కట్టి పోలీసు స్టేషన్‌లో అనుమతి పొందాలన్నారు. విగ్రహానికి సంబంధించిన వారు తప్పనిసరిగా రాత్రి పూట కూడా విగ్రహం దగ్గరే ఉండాలన్నారు. ప్రజలకు ఆటంకం కలుగకుండా రాత్రి 9 గంటల వరకే డిజెలకు అనుమతి ఉందని తెలిపారు. ఆదోని (రూరల్‌)లో ఇస్వి ఎస్‌ఐ విజయలక్ష్మి మాట్లాడారు. గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల సమన్వయంతో గణేష్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు పనిచేయాలన్నారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు సోదరభావంతో కలిసి జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నియమ నిబంధనలు పాటించని వారు ఎంతటి వారైనా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.