ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా స్థాయి యువజనోత్సవాలు గురువారం సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగాయి. సెట్విజ్, నెహ్రూ యువ కేంద్ర, సీతం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు హాజరై వివిధ పోటీలు, సాంస్కతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. సాంస్కతిక కళా వైభవం, జీవిత నైపుణ్యం, శారీరక, మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతను తెలుపుతూ వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. సెట్విజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 15 రకాల క్రీడాంశాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సెట్విజ్ సిఇఒ బి.రామగోపాల్, జిల్లా యువజన అధికారి వెంకట్ ఉజ్వల్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ కౌశిక్, సీతం కళాశాల డైరెక్టర్ ఎం. శశిభూషణ్ రావు, ప్రిన్సిపాల్ రమణ మూర్తి, బ్రహ్మ కుమారి అన్నపూర్ణ, మెప్మా పీడీ సుధాకర్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గోవిందరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డిడి సోమేశ్వరరావు, సంగీత కళాశాల అధ్యాపకురాలు బిందు తదితరులు పాల్గొని జ్వోతి ప్రజ్వలన చేసి, స్వామి వివేకానంద, గురజాడ చిత్రపటాలకు పూలమాలలు వేసి యువజనోత్సవాలను ప్రారంభించారు. అతిథులంతా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ బలమైన లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం నిరంతరం తపించాలని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆశయ సాధన కోసం అకుంఠిత దీక్ష, ఏకాగ్రత చాలా అవసరమని పేర్కొన్నారు. పోటీతత్వం అలవర్చుకోవాలని, మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, క్రమ శిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం 15 రకాల క్రీడాంశాల్లో వివిధ పోటీలు నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. సీతం కళాశాల అధ్యాపకులు, సెట్విజ్, యువజన సర్వీసుల శాఖ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యంలో విద్యార్థులు పాల్గొన్నారు.










