Sep 14,2023 21:06

కబడ్డీ పోటీలో తలపడుతున్న బాలికల జట్లు

విజయనగరం టౌన్‌: విజయనగరం అర్బన్‌ స్కూల్‌ గేమ్స్‌ పోటీలు గురువారం స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అన్ని పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన ఎంఇఒ పివి బి రామచంద్ర రాజు మాట్లాడుతూ క్రీడలు మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని తెలిపారు. ఎంతో మంది క్రీడాకారులు క్రీడల్లో రాణించి ఉన్నత ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి ఎల్‌ వి రమణ మాట్లాడుతూ క్రీడలను పాఠశాల స్థాయిలో అమలు చేయడం అంటే మానసిక, శారీరక ధృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం, క్రమ శిక్షణ కలిగిన ఉత్తమ పౌరులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చదువు ఎంత ముఖ్యమో మంచి భవిష్యత్‌ ఏర్పాటుకు క్రీడలు అంతే అవసరం అన్నారు. అనంతరం వాలీబాల్‌, కబడ్డీ, బాల్‌ బ్యాడ్మింటన్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను ప్రారబించారు. కార్యక్రమంలో నియోజక వర్గ ఇంచార్జీ సంజీవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గోపాల్‌,తౌడుబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు.