ప్రజాశక్తి-కాకినాడ, సామర్లకోట రూరల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం చేపట్టిన సమరభేరి ప్రచారం ఆదివారం ఉదయం మెయిన్ రోడ్డు మార్కెట్లో నిర్వహించారు. మార్కెట్కు వచ్చిన ప్రజలు సిపిఎం ప్రచారాన్ని ఆదరిస్తూ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఆచరణలో అమలు చేయలేదు సరికదా ఉన్న ఉపాధిని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆదాయాలు అంతంతమాత్రంగా ఉంటే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉపయోగించిన విద్యుత్ కంటే బిల్లులలో రకరకాల ఛార్జీల పేరుతో భారాలు వేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వ షరతులకు లోబడి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. సెప్టెంబర్ 4న ఉదయం 10 గంటలకు కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని కోరారు. పార్టీ నగర కమిటీ సభ్యులు కె.సత్తిరాజు, దుంపల ప్రసాద్, కె.నాగజ్యోతి, సిహెచ్.సతీష్, సూరిబాబు, ఆదర్శ్, జయరాం పాల్గొన్నారు.
ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. సిపిఎం సమరభేరిలో భాగంగా ఆదివారం సుందరయ్య భవన్లో నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. కె.దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యాయ విద్య పూర్తి చేసిన దివాకర్ మాట్లాడుతూ దేశంలో యువశక్తికి లోటు లేదన్నారు. వారికి తగిన ఉపాధి కల్పించి, దేశ సంపద సృష్టికి ఉపయోగించుకోవాలన్నారు. యువతను ప్రక్కదోవ పట్టించే పద్ధతులను రూపుమాపడానికి పాలకులు చిత్తశుద్ధిగా కషి చేయాలన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా యువశక్తి సక్రమంగా ఉపయోగించడం లేదన్నారు. రాష్ట్రంలో కూడా సచివాలయాలు తప్ప పోలీసు, విద్యా తదితర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గించి, ఆ పోస్టులు అర్హులైన నిరుద్యోగులతో నింపాలని, యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు 200 రోజులకు పెంచి, రోజుకి 600 రూ. చెల్లించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సూరిబాబు, వరహాలు, జయరాం, సూర్య, ఆదర్శ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో సిపిఎం జిల్లా నాయకుడు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఆచరణలో అమలు చేయలేదు సరికదా ఉన్న ఉపాధిని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆదాయాలు అంతంతమాత్రంగా ఉంటే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రజలు ఉపయోగించిన విద్యుత్ కంటే బిల్లులలో రకరకాల చార్జీల పేరుతో భారాలు వేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శాఖకార్యదర్శి శ్రీనివాసరావు, యువజన సంఘ నాయకులు సయ్యపురెడ్డి నరసింహారాజు, సిఐటియు పట్టణ కార్యదర్శి నరవ సురేష్ కుమార్, చల్లా మహేశ్వరరావు, రామకృష్ణ పాల్గొన్నారు.










