ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అండర్ 19 బాల బాలికల బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సోమవారం జరిగాయి. స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలను సెట్విజ్ సిఇఒ బి.రాంగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యం కలిగించడంతో పాటు మంచి భవిష్యత్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ఎంతోమంది క్రీడాకారులు బ్యాడ్మింటన్ ద్వారా ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. బాగా ఆడి జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర పోటీల్లో సత్తా చాటాలని కోరారు. అనంతరం జరిగిన ఎంపిక పోటీల్లో ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అండర్ 19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈనెల 29 నుంచి 31 తేదీ వరకు విజయవాడ లో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
11న హాకీ, త్రోబాల్ జిల్లా జట్లు ఎంపిక పోటీలు
ఈనెల 11న స్థానిక రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో అండర్ 19 జిల్లా హాకీ, త్రో బాల్ జిల్లా బాల, బాలికలు జట్లు ఎంపిక జరుగుతుందని అండర్ 19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి పివిఎల్ఎన్ కృష్ణ తెలిపారు. అభ్యర్థులు తమ పుట్టిన తేది సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు పట్టుకొని ఆరోజు ఉదయం 9 గంటలకు క్రీడా మైదానానికి చేరుకోవాలని తెలిపారు.
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు 13 మంది ఎంపిక
ఇటీవల పార్వతీపురం ఆర్సిఎం ఉన్నత పాఠశాలలో ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ క్రీడా పోటీలలో గంట్యాడ జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 9 మంది బాలికలు, నలుగురు బాలురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్లు పివిఎస్ఎన్ రాజు, బైరెడ్డి శ్రీనును హెచ్ఎం అలజంగి ఝాన్సీ అభినందించారు.










