
ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్ప్లాంట్లో ఉత్పత్తికనుగుణంగా కార్మికులకు ఇన్సెంటివ్ చెల్లించాలని కోరుతూ సిఐటియు నాయకులు సోమవారం వైర్ రాడ్ మిల్లు-2 విభాగాధిపతి కెవి.దినకర్కు వినతిపత్రం అందించారు. వైర్ రాడ్ మిల్లు-2 విభాగానికి నూతనంగా ఎన్నికైన సిఐటియు కమిటీ సోమవారం కెవి.దినకర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ, గడిచిన డిసెంబర్ నెలలో డబ్ల్యూ ఆర్ ఎం రేటెడ్ ఉత్పత్తి కన్నా 20 శాతం అధికంగా అంటే 120 శాతం ఉత్పత్తిని కార్మికులు సాధించారని తెలిపారు. పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంటివ్ పెంచాలని డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 30వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభలో ఉక్కు కార్మికులు, అధికారులు, కాంట్రాక్టు కార్మికులు కుటుంబాలతో సహా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
యూనియన్ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, సమయానికి వేతన ఒప్పందం జరగపోయినప్పటికీ, పాత ఇన్సెంటివ్కు కోతపెట్టి ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసినప్పటికీ కార్మికులు రేయింబవళ్లు కష్టపడి రికార్డు ఉత్పత్తి సాధించడం అభినందనీయమన్నారు. అధ్యక్షుడు వైటి.దాస్ మాట్లాడుతూ, ఉత్పత్తి విషయంలో యాజమాన్యానికి సహకరిస్తూనే కార్మికుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం సిఐటియు పోరాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైర్ రాడ్ మిల్లు- 2 ఆపరేషన్స్ ఇన్ఛార్జి నారాయణరావు, మెకానికల్ విభాగాధిపతి బేగ్, డబ్ల్యూఆర్ఎం కార్యదర్శి సిహెచ్.అరుణ్ కుమార్, అధ్యక్షుడు ఆర్.రామ్మోహన్రావు, త్రిఫ్ట్ డైరెక్టర్ కర్రి శ్రీనివాస్, టి.శ్రీనివాసులు, ఎస్.సంతోష్కుమార్, పంకు చిన్నారావు పాల్గొన్నారు.