Nov 10,2023 20:42

వేలం పాటలు నిర్వహిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - కౌతాళం
జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంలో ఒకటైన శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో తలనీలాలు పోగు చేసుకోవడానికి, దేవస్థానం పాత పరిపాలన భవనం పడగొట్టడానికి శుక్రవారం వేలంపాటలు నిర్వహించారు. కర్నూలు దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దేవాలయ సహాయ కమిషనర్‌ వాణి బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. తలనీలాలు పోగు చేసుకునే హక్కు ఒక సంవత్సరకాల కాల పరిమితితో బహిరంగ వేలంలో నలుగురు పాల్గొన్నారు. రాజా ఎంటర్‌ప్రైజెస్‌ హిందూపూర్‌ వారు రూ.1,63,80,000 దక్కించుకున్నారు. దేవస్థాన పాత కార్యాలయ పరిపాలన భవనం పడగొట్టడానికి ఐదుగురు పాల్గొనగా కర్నూలు నగరానికి చెందిన సురేష్‌ కుమార్‌ రూ.3.44 లక్షలకు దక్కించుకున్నారు. ఈ వివరాలను దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపుతామని దేవాలయ సహాయ కమిషనర్‌ వాణి తెలిపారు. దేవాలయ పర్యవేక్షకులు రామ్మోహన్‌, వెంకటేష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌, దేవాలయ ఇన్‌స్పెక్టర్‌ వీరేష్‌ పాల్గొన్నారు.