Oct 23,2023 00:41

 నాయకులు, కార్మికులతో మాట్లాడుతున్న రవిబాబు

ప్రజాశక్తి-అరకులోయ :ఏజెన్సీ ప్రాంతంలోని ఆరు ఏపీ టూరిజం యూనిట్ల పరిధిలోని టూరిజం కార్మికుల సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభ రవిబాబు తెలిపారు. ఈనెల 22వ తేదీ తర్వాత ఏ రోజునైనా సమ్మెబాట పట్టవచ్చునని ఏపీ టూరిజం కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో టూరిజం కార్పొరేషన్‌ ఎండి కన్నబాబుకి సమ్మె నోటీసులు సమర్పించిన విషయం తెలిసిందే. సమ్మె విషయం ఎమ్మెల్సీ రవిబాబు దృష్టికి కూడా టూరిజం కార్మికులు తమ సమస్యలను వినతిపత్రం రూపంలో సమర్పించారు.ఇందుకు స్పందించిన రవి బాబు టూరిజం కార్మికులతో, టూరిజం ఎండితో మధ్యవర్తి గా వ్యవహరించి ఆదివారం సిఐటియు నాయకుల సమక్షంలో పలు సమస్యలపై చర్చించారు. టూరిజం ఎండి కన్నబాబుతో ఫోన్లో చర్చించి కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను కూలం కుశంగా వివరించారు. కార్మికుల న్యాయపరమైన కోరికలు పరిష్కరించాలని ఆయనతో చర్చించగా కొన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారని రవిబాబు కార్మికులకు తెలిపారు. కార్మికులతో టూరిజం ఎండి నేరుగా కూర్చుని చర్చించే విధంగా చర్యలు తీసుకోవాలతని కార్మికులు కోరారు. ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరించడానికి కనీసం 15 రోజులు గడువు కావాలని కార్పొరేషన్‌ ఎండి చెప్పినట్లు రవిబాబు అన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఏ రోజునైనా సమ్మెకు వెళ్లడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు. కార్మికులతో అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కూడా కార్మిక సంఘం నాయకులతో సోమవారం చర్చించనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో అనంతగిరి సిపిఎం జెడ్పిటిసి గంగరాజు, టోకూరు సర్పంచ్‌ మొస్య, అరకులోయ మాజీ ఎంపీపీ అరుణ కుమారి సిఐటియు అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఏపీ టూరిజం కార్మిక సంఘం నాయకులు గంగరాజు, బాబురావు, నరసింహ, అంజలిరావు, కార్మికులు పాల్గొన్నారు.