
ప్రజాశక్తి -చీడికాడ:చీడికాడ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే నియమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శంకర్రావు కోరారు. ఈ మేరకు శనివారం అనకాపల్లి జిల్లా విద్యా శాఖ అదికారి వెంకటలక్ష్మిమ్మకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, చీడికాడ మండలంలో మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు విద్యలో ఏ విధంగా రాణిస్తారని ప్రశ్నించారు. పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కారం చేయాలని లేదంటే విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తామని తెలిపారు. స్కూల్లో 532 పిల్లలు ఉంటే కనీసం తాగడానికి ఆర్ఓ ప్లాంట్ లేక పోవడం అన్యాయమన్నారు. గతంలో నాస స్వచ్ఛంద సంస్థ వాటర్ ప్లాంటును మంజూరు చేసిందని, అది పూర్తిగా ములన పడిందని తెలిపారు. వందమంది అమ్మాయిలకు హస్టల్ ఉంటే పర్మినెంట్ వార్డెన్ లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. మోడల్ స్కూల్ పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్షంగా ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుందని తెలిపారు. తాత్కాలింగా ఉన్న వార్డన్ కూడా ఆగష్టు 1వ తేదీ నుండి వెళి పోయారని, పర్మినెంట్ వార్డెన్ నియమించాలని డిమాండ్ చేసారు. ఇంత మంది ఆడపిల్లలు ఉన్న హస్టల్లో ఆరోగ్యం బాగోలేక పోతే చూసు కోవడానికి కనీసం మహిళా హెల్త్ వర్కర్ను నియమించక పోవడం దుర్మార్గమన్నారు. తీమిరాం, వాకపల్లి, చీడిపల్లి, తురువోలు, తంగడు బిల్లి మీదుగా స్కూల్కు ఆర్టిసి బస్సు ను నడపాలని కోరారు. బాత్ రూమ్ డోర్సు, ఫ్యా˜న్లు, లైట్లు సౌకర్యాలు మెరుగు పర్చాలన్నారు. పాఠశాలలో దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించి పిల్లలు చదువుకోవడానికి మరింతగా అబివృద్ది చేయాలని కోరారు,