Apr 20,2023 00:01

డిఇఒకు అంబేద్కర్‌ చిత్ర పటాన్ని అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

డిఇఒకు యుటిఎఫ్‌ నాయకుల వినతి
ప్రజాశక్తి-అనకాపల్లి

జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వర్క్‌ అడ్జస్ట్మెంట్‌లో భాగంగా వివిధ పాఠశాలల్లో నియమితులైన ఉపాధ్యాయులను విద్యా సంవత్సరం ముగిస్తున్నందున ఏప్రిల్‌ 29 లోగా వారి పాత స్కూళ్లకు రిలీవ్‌ చేయాలని కోరారు. స్పాట్‌ వాల్యూయేషన్కు సంబంధించి 55 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులను, స్పాండిలైటిస్‌, దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతున్న వారిని, గర్భిణులు, చంటి పిల్లల తల్లులను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్కు అర్హత ఉండి ఆర్డర్‌ రాని ఉపాధ్యాయులు స్పాట్‌ వేల్యూషన్కు అంగీకరిస్తే ఆర్డర్‌ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా డిఇఓ వెంకట లక్ష్మమ్మకు అంబేద్కర్‌ చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చిన్న అబ్బాయి, నాయకులు పాల్గొన్నారు.