'ఉపాధి' పెండింగ్ బిల్లులు ఇవ్వాలి
ప్రజాశక్తి - కొత్తపల్లి
పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, మండల సహాయ కార్యదర్శి ఏ ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం ముసలమడుగు గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం 2022 ఏప్రిల్, మే నెలలో చేసిన పనులకు నేటికీ చెల్లించలేదు అన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి కొంతమందికి రెండు మూడు వారాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పని ప్రదేశాలలో మెడికల్ కిట్లు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం టిసిఎస్ సాఫ్ట్వేర్ నుంచి ఎన్ఐసి సాఫ్ట్వేర్లకి ఉపాధి హామీ పథకాన్ని మార్చిన తర్వాత కూలీలకు ఆన్లైన్ మస్టర్ చేయాలంటే సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. సమ్మర్ అలవెన్సులు రావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు మమత, పుష్పావతి, మద్దిలేటి, నాగలక్ష్మి, శేష గౌడ్, హుస్సేన్ పాల్గొన్నారు.










