ప్రజాశక్తి-చింతూరు : గ్రామీణ ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులపై సోమవారం తుమ్మల గ్రామంలో జరిగిన గ్రామసభలో ఎంపిటిసి వేక రాజ్ కుమార్ అధికారులను నిలదీశారు. తుమ్మల గ్రామంలో గంగన్న మెట్ట, తుమ్మల, లచ్చి గూడెం పంచాయతీల పరిధిలో ఉన్న వారికి ఈ గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి ఉపాధి పెండింగ్ బిల్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోస్టాఫీసు అధికారులు డబ్బులు అడిగితే మొత్తం పెండింగ్ ఉన్నాయని, రంపచోడవరం కార్యాలయానికి పంపించామని చెబుతున్నారని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు నుండి ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులను అడిగిన వారు పోస్టాఫీసు వాళ్లకు సంబంధం అంటున్నారని తెలిపారు. మేట్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభలో పాల్గొన్న ఎన్ఆర్ఇజిఎస్ జెఇ స్పందిస్తూ సమస్యలను వారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, సచివాలయం సెక్రెటరీ, సచివాలయం సిబ్బంది, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.










